తమిళనాడు, మే 11 : తమిళనాడులో మరో ప్రభంజనం కోసం సూపర్ స్టార్ రజనీ కాంత్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు ఆయన చెప్పిన చాలా రోజుల గడిచినప్పటకి పార్టీ ఆరంభంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే పార్టీ బలంపైన, వ్యూహాల పైన, కచ్చితంగా విజయబావుటా ఎగరవేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న ప్రణాళికోగానీ... అందుకు అనుగుణంగా సూపర్స్టార్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తన రాజకీయ పార్టీ ప్రారంభంతోపాటు సినిమాలను కూడా ప్రణాళికాబద్ధంగా అభిమానులు, రాష్ట్రప్రజల ముందుకు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం పోయెస్గార్డెన్లోని తన నివాసంలో రజనీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే నెలలో కోయంబత్తూరులో భారీ రాజకీయ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారానికిపైగా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సూపర్స్టార్ రజనీకాంత్ వరుస కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. కాలా ఆడియో ఆవిష్కరణ వేడుక, మక్కల్ మండ్రం సభ్యులతో సమావేశం, కొన్ని జిల్లాలకు కార్యవర్గ సభ్యుల నియామకం, సమావేశాలు, చర్చలు, ప్రత్యేక వ్యూహ బృందం ఏర్పాటుపై దృష్టి సారించారు. పార్టీ ప్రారంభానికి ముందుగానే వందశాతం పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వచ్చే నెల పెద్ద సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతేడాది డిసెంబరు 31న రాజకీయ ప్రకటన చేసిన రజనీకాంత్ ఆ సందర్భంగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో తన పార్టీ బరిలో నిలుస్తుందని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, తాను భర్తీ చేస్తానని ప్రకటించారు. ఏది ఏమైనా తమిళనాట ప్రస్తుతం ఉన్న పార్టీలకు దీటుగా రజనీ తన కార్యచరణను మొదలుపెట్టనున్నారు.