న్యూఢిల్లీ, జూలై 8 : వ్యక్తిగత గౌరవాన్ని కాపాడడం కంపెనీ ప్రధాన నైతిక భాధ్యత, అలా జరగనందుకు క్షమాపణ చెబుతున్నా. భవిష్యత్లో ఇలాంటివి జరగవని హామీ ఇస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. కంపెనీ నిర్ణయంలో భాగంగా మానవ వనరుల విభాగాధిపతి (హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్) ఓ ఉద్యోగి ని మరుసటి ఉదయం 10 గంటలకు రాజీనామా చేయండి, లేదంటే మేమే తొలగిస్తాం అంటూ చెప్పిన ఆడియో సంభాషణ సామాజిక మాధ్యమాల్లో పాకింది. దీంతో స్పందించిన మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా క్షమాపణ చెప్పారు. టెక్ మహీంద్రా వైస్ ఛైర్మన్ వినీత్ నయ్యర్ మాట్లాడుతూ.. ఉద్యోగికి, హెచ్ఆర్ ప్రతినిధికి జరిగిన సంభాషణ మా దృష్టికి వచ్చింది. చర్చ ఆ తరహాలో జరగడం పట్ల మేం తీవ్రంగా చింతిస్తున్నాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెక్ మహీంద్ర సి.పి. గుర్నాని తో సహా ఉన్నతాధికారులు సైతం క్షమాపణలు తెలిపారు.