గుంటూరు, మే 10: గుంటూరు పట్టణంలోని చంద్రమౌళి నగర్ పోస్టాపీసులో ప్రాంతీయ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశీయానమంటే ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే వారని... ప్రస్తుతం దైనందిన వ్యవహారంగా మారిందని అన్నారు. పాస్పార్టు కోసం గతంలో వివిధ ప్రాంతాలకు వెళ్లి నెలల తరబడి ఎదురు చూసేవారని... ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంలోనూ పాస్ పోర్టు సేవలు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు. పాస్పోర్టు కేంద్రం ఏర్పాటుతో గుంటూరు ప్రజల కోరిక నెరవేరిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. పాస్పోర్టు సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని... గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆనందబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ రామకృష్ణ, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.