హైదరాబాద్, మే 10 : అలనాటి మేటి తార సావిత్రి బయోపిక్.. "మహానటి" చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రేక్షకుల నుండి, సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఈ చిత్రంపై ఇప్పటికే హేమాహేమీయులంత ప్రశంసల జల్లులు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన.. తన ట్విట్టర్ లో.. "ఎంతటి అద్భుతమైన చిత్రం! "మహానటి" సినిమా చూసి దిమ్మతిరిగిపోయింది. కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో జీవించేశారు. అద్భుతమైన ప్రదర్శన. ఆమె సినిమాను గొప్పగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్కు, నిర్మాత స్వప్న దత్కు నా అభినందనలు. సమంత, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య చాలా బాగా నటించారు" అని ట్వీట్లో పేర్కొన్నారు.