బెంగళూరు, మే 9 : కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 12న జరిగే సాధారణ ఎన్నికల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 58,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా 600 కేంద్రాలను కేటాయించారు. పదికి పైగా కేంద్రాలను దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశారు. దీనిపై సంజయ్ కుమార్ స్పందిస్తూ.. "రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 58,000 పోలింగ్ కేంద్రాల్లో 600 కేంద్రాలను(పింక్ బూత్స్) పూర్తిగా మహిళలకే కేటాయించాం. మరో పదికి పైగా దివ్యాంగుల కోసం, 28 కేంద్రాలను ఇతర వ్యక్తుల కోసం కేటాయించాం. ఈ ఎన్నికల్లో 80,000 వీవీపాట్లు(ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్) యంత్రాలతో పాటు 80,000 ఈవీఎంలను ఉపయోగించనున్నాం. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ తర్వాత ఎవరైనా ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిస్తే వారిపై నిషేధం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి" అని తెలిపారు.