జైపూర్, మే 9 : రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు ప్లేఆఫ్ అవకాశాలను నిలబెట్టుకొంది. జైపుర్ వేదికగా సవాయి మాన్ సింగ్ స్టేడియంలో కింగ్స్ X1 పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో రహనేసేన విజయం సాధించింది. మొదట టాస్ నెగ్గిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఆ జట్టులో జోస్ బట్లర్ (82) జోష్ చూపించాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై (4/34), ముజీబ్ (21/2) రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ X1 జట్టులో కే.ఎల్ రాహుల్ (95, నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్లు ఎవ్వరు కూడా రాణించలేదు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో గౌతమ్ (2/12), ఇష్ సోధి (1/14) కట్టుదిట్టంగా చేశారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు జోష్ బట్లర్ కు దక్కింది.