న్యూఢిల్లీ, మే 8: ఉత్తర, తూర్పు భారతాలను అనూహ్య వాతావరణ మార్పులు దడ పుట్టిస్తున్నాయి. మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, దుమ్ము తుఫాను సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజధాని ఢిల్లీ నగరాన్ని గత రాత్రి దుమ్ము తుపాను కమ్మేసింది. గంటకు 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విపరీతమైన దుమ్ము, ధూళి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. తుపాను ప్రభావం ఢిల్లీపై విపరీతంగా ఉంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన ఆరు విమానాలు ఆలస్యమయ్యాయి. మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో దిల్లీ సహా పలు ప్రాంతాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.