జేడీఎస్ పై సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని

SMTV Desk 2018-05-05 15:26:26  modi, jds, congress, karnataka elections, jds

బెంగళూరు, మే 5: కన్నడ నాట రాజకీయం ప్రచారాలతో వేడెక్కింది. ఈ నెల 12న జరిగే ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ నేతృత్వంలోని జనతా దళ్ (సెక్యులర్ - జేడీఎస్)పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన బీజేపీ గెలుపు కోసం తుమకూరులో ప్రచారం చేశారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఈ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాపాడేందుకు జేడీఎస్ పని చేస్తోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ మాత్రమే ఏర్పాటు చేయగలదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " కాంగ్రెస్‌ను జేడీఎస్ ఓడించలేదని పోల్ సర్వేలు, రాజకీయ పండితులు సహా అందరూ చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా మార్చగలరా? అంటే అది ఒక్క బీజేపీ మాత్రమే. కాంగ్రెస్‌ను ఎవరైనా కాపాడుతున్నారా? అంటే అది కేవలం జేడీఎస్ పార్టీనే. జేడీఎస్‌తో రహస్య అవగాహన ఉందో, లేదో కాంగ్రెస్ స్పష్టం చేయాలి. ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు" అని మోదీ ఆరోపించారు.