పట్నా, జూలై 07 : ఢిల్లీ, పట్నా, రాంచీ, పూరి, గుడ్గావ్ సహా 12 ప్రాంతాల్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆస్తులపై సీబీఐ ఈరోజు ఉదయం సోదాలు నిర్వహించింది. 2006 బీఎన్ఆర్ హోటళ్ల టెండర్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై లాలు తన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజశ్వీ ప్రతాప్, ఐఆర్సీటీసీ ఎండీ పీకే గోయల్, లాలూ అనుచరుడు ప్రేమ్ చంద్ గుప్తా, అతని సతీమణి సుజాత మరి కొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. పట్నాలోని స్థలాన్ని లాలు ప్రసాద్ యాదవ్ తమ కుటుంబసభ్యులకు అక్రమంగా ఇచ్చారని సీబీఐ నిర్ధారించింది. అలాగే 2006లో హర్ష్ కొచ్చర్ అనే వ్యాపారవేత్తకు పూరీ, రాంచిలోని రైల్వేస్లో హోటళ్లు నడిపేందుకు స్థలాలు ఇచ్చినందుకు లాలూకి హర్ష్ కొచ్చర్ రెండు ఎకరాల స్థలాన్ని రాసిచ్చినట్లు సీబీఐ నిర్ధారిస్తోంది.