గుంటూరు జిల్లాలో దారుణం..

SMTV Desk 2018-05-03 13:30:01  dachepalli incident, rape in dachepalli, guntur, chandrababu naidu

అమరావతి, మే 3 : గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు దాచేపల్లిలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా నిందితుడు ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. దాచేపల్లిలో ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను... అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వెళ్లాడని స్థానికులు చెప్తున్నారు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. విషయం బయటపడడంతో సుబ్బయ్య పరారయ్యాడు. బాలిక బంధువులు ఆస్పత్రి దగ్గరకు చేరుకుని ఆందోళన చేశారు. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వెంటనే దాచేపల్లికి వెళ్లాలని జిల్లా మంత్రులు, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.