పార్టీ నిర్మాణమే మా తక్షణ కర్తవ్యం : కోదండరాం

SMTV Desk 2018-05-03 12:33:26  m.kodandaramireddy, tjs president, telangana, hyderabad

హైదరాబాద్‌, మే 3 : పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మించడమే తమ తక్షణ కర్తవ్యమని తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నిలబడాలనే ఆసక్తి ఉన్నవారు తమకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నవారికి తమ పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తు ఫారాలను పార్టీ వెబ్‌సైట్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెజస భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. నిధులు, విధుల వికేంద్రీకరణ వల్లే అట్టడుగు వర్గాలకు పాలనలో ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణను తమ పార్టీ కోరుకుంటుందని కోదండరాం చెప్పారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటరు జాబితాలో తప్పులు సవరించుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని కార్యకర్తలకు సూచించారు.