హైదరాబాద్, జూలై 6 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ జై లవ కుశ టీజర్ ను రిలీజ్ చేసింది ఆ చిత్ర బృందం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్టు సమాచారం. ఐతే ఇప్పుడు కేవలం జై పాత్రకు సంబంధించిన టీజర్ మాత్రమే రిలీజ్ చేసారు. ఇందులో ఎన్టీఆర్ అదిరిపోయే లుక్స్ తో కనిపించి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసారు. మరికొద్ది రోజుల్లో మిగిలిన రెండు పాత్రలకు సంబంధించిన టీజర్లను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కాని ఈ మధ్య టీజర్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ విడుదలకు ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వెంటనే నిర్మాణ సంస్థ ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు లీకేజ్ వెనుకనున్న ప్రధాన అనుమానితుడు గణేష్ అరెస్ట్ చేసారు. దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేదా థామస్, సీకె మురళీధరన్ , బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.