పెళ్లి పీటల మీదే అసువులు బాసిన వరుడు

SMTV Desk 2018-05-01 18:06:03  

లఖ్‌నవూ, మే 1 : ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కాసేపటిలో పెళ్లి చేసుకోబోయే వరుడు మరణించిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో సరదాగా ఓ మిత్రుడు జరిపిన కాల్పుల్లో తూటా వరుడికి తగలడంతో పెళ్లి పీటలపైన అసువులు బాశాడు. దీంతో వధువు, వరుడి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది . ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలోని రామ్‌పూర్‌లో జరిగింది. సునీల్‌ వర్మ (25) అనే యువకుడు తన వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చాడు. పెళ్లి పీటలపై కూర్చొని ఉండగా.. హఠాత్తుగా అతడి ఛాతిలోకి తూటా దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వివాహ వేడుకలో పెద్ద శబ్దంతో సంగీతం పెట్టడంతో తుపాకీ పేలిన శబ్దం ఎవరికీ వినబడలేదు. దీంతో అక్కడ ఉన్న వారికి ఏం జరిగిందో తెలియలేదు. అనంతరం కాసేపటికి వరుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసంగాలింపు చర్యలు చేపట్టారు.