న్యూఢిల్లీ, మే 1 : విమానంలో ప్రయాణించే వారికి ఒక శుభవార్త. రాబోయే మూడు, నాలుగు నెలల్లో విమానాల్లో ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకునేందుకు, మొబైల్ కమ్యూనికేషన్లకు అవకాశం రాబోతోంది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలకు అత్యున్నత నిర్ణయాక మండలి టెలికాం కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ శాఖ కార్యదర్శి అరుణా సుందర రాజన్ సమావేశం అనంతరం వెల్లడించారు. దేశంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మొబైల్ ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేందుకు గాను ట్రాయ్ ఈ ప్రతిపాదనలు చేసింది. దీని ద్వారా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కాల్స్, డేటాను వినియోగించుకునే వెసులుబాటు ప్రయాణికులకు దక్కనుంది.