కర్ణాటక, మే 1 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 12 రోజులు లేవు. దీంతో పార్టీ నాయకులూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. చామరాజ్నగర్లోని సంథెమరహళ్ళి లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీకి ఓ సవాల్ విసిరారు. కాగితం మీద రాసుకుని కాకుండా, 15 నిమిషాలపాటు గడగడ మాట్లాడాలని నిలదీశారు. "రాహుల్ గాంధీ నాకు ఒక సవాల్ విసిరారు. రాహుల్ తో 15 నిమిషాలపాటు మాట్లాడితే నేను ఆయన ముందు నిలబడలేనన్నారు. నేను ఒక సవాల్ విసురుతున్న. ఆయన ఇంగ్లిష్ మాట్లాడవచ్చు, హిందీ మాట్లాడవచ్చు, లేదా మీ అమ్మగారి మాతృ భాష మాట్లాడవచ్చు. మీరు కోరుకున్న భాషలో మాట్లాడండి. కాగితం మీద రాసుకున్నది చదవడం కాకుండా 15 నిమిషాలపాటు గడగడ మాట్లాడండి. గత ఐదేళ్ళలో మీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడండి" అని మోదీ అన్నారు.