రాంచీ, మే 1: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో సారి అనారోగ్యానికి లోనయ్యారు. హృద్రోగ, మూత్ర పిండ సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు వైద్యం కోసం ఆయన్ను అక్కడే ఉంచగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్ చేయవచ్చని తెలిపారు. దీంతో మంగళవారం ఆయన్ను రాంచీకి తరలిస్తున్న సమయంలో మళ్లీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. లాలూకు బీపీ, షుగర్ స్థాయిలు పెరగడంతో ఇద్దరు వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డా.లాల్ మాంఝీ తెలిపారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు శిక్ష పడటంతో ఆయన ఝార్ఖండ్లోని బిర్సా ముందా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో మార్చి 29న ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం లాలూను చికిత్స నిమిత్తం దిల్లీలోని ఎయిమ్స్కు తరలించేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.