న్యూఢిల్లీ, మే 1 : దేశంలో అధికార బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ అధిష్టానంకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వీళ్ల వ్యవహారంపై స్పందించారు. "ఒక అతను (విజయ్ రూపానీ) గూగుల్ని-నారదుడ్ని పోలుస్తూ మాట్లాడతారు. మరోకరమో (విప్లవ్) మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉందంటారు. ఆయన అక్కడితోనే ఆగలేదు. యువకులను ఉద్దేశించి ‘ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకండి’ అంటాడు. మరోసారి అందాల పోటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాడు. వాళ్లిద్దరి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మోదీగారి వారసులు ఇలా ఉన్నారు. వీళ్లేం ముఖ్యమంత్రులు. వీళ్లా ప్రజల్ని పాలించేంది? ఇది ఇంతటితోనే ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు" అని రేణుకా చౌదరి పేర్కొన్నారు.