శాన్ ప్రాన్సిస్కో, మే 1 : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కు ఇటీవల వ్యక్తిగత సమాచార దుర్వినియోగ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆ సంస్థకు మరో షాక్ తగిలింది. ఫేస్బుక్తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు వాట్సాప్ సీఈవో జాన్ కౌమ్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం తన ఫేస్బుక్ పేజీలో అధికారికంగా పోస్ట్ చేశారు. అంతేకాదు ఫేస్బుక్ డైరెక్టర్ బోర్డు నుంచి కూడా కౌమ్ తప్పుకొంటున్నట్లు అమెరికా మీడియా తెలిపింది. అయితే ఇప్పటివరకూ దీనిపై ఫేస్బుక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫేస్బుక్ను వీడటంపై కౌమ్ ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. వాట్సాప్ మాతృక సంస్థ అయిన ఫేస్బుక్ ఇప్పటికే వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే వాట్సాప్ మాత్రం ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించే దిశగా వాట్సాప్ ప్రణాళికలు రచిస్తోన్నట్లు అమెరికా మీడియా వివరించిది.