కర్నూలు, మే 1: కర్నూలు జిల్లాలో కారు డీవైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ జాతీయ రహదారిపై అలంపూర్ టోల్ ప్లాజాకు కిలో మీటరు దూరంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో కర్నూలు పాతబస్తీకీ చెందిన కిరణ్సింగ్ (47), ఆయన కూతురు హర్షిత (18), మేనకోడలు గాయత్రీబాయి(19) దుర్మరణం చెందగా, భార్య గాయత్రి, బావమరిది కొడుకు హర్షిత్, వదిన విజయబాయికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి కిందపడినట్లు తెలుస్తోంది. స్టీరింగ్ ఎగిరి కింద పడిపోయింది. కారుముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.