గుజరాత్, ఏప్రిల్ 30 : బీజేపీ నేతలకు వారి అధిష్టానం ఎంత చెప్పిన నేతల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును, ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మహాభారతం సమయంలోనే ఇంటర్నెట్ ఉందంటూ ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో దుమారమే రేపాయి. ఇప్పుడు తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. ఆదివారం అహ్మదాబాద్లో నిర్వహించిన ‘దేవర్శి నారద్ జయంతి’ ఉత్సవాలకు విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రుపానీ మాట్లాడుతూ.. "గూగుల్ మనకు ఎంతో డేటాను ఇస్తుంది. అచ్చం బ్రహ్మ పుత్రుడు నారదుడిలాగే. నారదుడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. అదే విధంగా గూగుల్ కూడా. నారదుడు రామాయణంలో ఉన్నాడు, మహాభారతంలోనూ ఉన్నాడు. ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్తుండేవాడు. నాకు తెలిసి భూమిపై తొలి పాత్రికేయుడు నారదుడేనేమో!. నారదుడు ఏం చేసినా లోక కల్యాణం కోసమే చేశాడు" అని పేర్కొన్నారు