విశాఖపట్నం, ఏప్రిల్ 28 : ప్రతిపక్ష వైసీపీతో బీజేపీ కలవాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు.. సీఎం అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావట్లేదని భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహంపై బీజేపీలో ఇప్పటి వరకూ చర్చ జరగలేదన్నారు. భాజపాను రాష్ట్రంలో బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. కేంద్ర సహాయమంత్రి అథవాలే వ్యాఖ్యలు భాజపా అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు దగ్గర కావాలని చంద్రబాబు చూస్తున్నారని హరిబాబు ఆరోపించారు. "చంద్రబాబు పదే పదే కేసుల విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏదైనా తప్పు జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు గురించి కేంద్ర పెద్దలు ఎవరూ మాట్లాడటం లేదు. మరి కేసులంటూ చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. పోలవరం తెలుగు ప్రజలకు నరేంద్రమోదీ ఇచ్చిన వరం. ముంపు మండలాలను ఏపీలో కలిపినందునే పోలవరం ముందుకెళ్తొంది " అని హరిబాబు వ్యాఖ్యానించారు.