హైదరాబాద్, ఏప్రిల్ 27 : దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెరాస 17వ ప్లీనరీని కొంపల్లిలో కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించి.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నేతలనుద్దేశించి ప్రసంగించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనతో కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని తెలిపారు. కేసీఆర్..మోదీ ఏజెంట్ అని రాహుల్ అంటున్నారని... టెంటే లేని ఫ్రంట్ అంటున్నవారు ఎందుకు భయపడుతున్నారని ప్లీనరీలో సీఎం కేసీఆర్ నిలదీశారు. ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. " జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీల పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. దేశం కోసం నేను చేసిన ఆలోచనతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు వచ్చాయి. కేసీఆర్.. మోదీ ఏజెంట్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కేసీఆర్ జెండా ఎత్తితే దించడు. దేశం గురించి కేవలం కాంగ్రెస్, భాజపాలే మాట్లాడాలా?. భాజపా, కాంగ్రెస్ రాష్ట్రాల మధ్య నీళ్ల కొట్లాటలు పెట్టాయి. జలసమస్యలపై ప్రధాని, మాజీ ప్రధాని జవాబు చెప్పాలి. భాజపా, కాంగ్రెస్ తస్మాత్ జాగ్రత్త.. మీ పని అయిపోయింది’ అని కేసీఆర్ హెచ్చరించారు.