ముంబై, ఏప్రిల్ 27 : దేశంలో ఎన్నడు లేని విధంగా మహిళాలపై అత్యాచారాలు, దాడులు తీవ్రమయ్యాయి. ఈ ఘటనలపై పలు చిత్ర పరిశ్రమ నటీనటులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారత్లో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. మల్లిక కథానాయికగా నటించిన చిత్రం ‘దాస్ దేవ్.’ గురువారం ముంబయిలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.." దేశంలో పిల్లల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు సిగ్గుచేటు. గాంధీజీ తిరిగిన ఈ భారతదేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డాగా మారింది. ఇలాంటి సమయంలో దేశ ప్రజలు మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో మీడియానే ఏదో ఒకటి చేయగలదు. మీడియా లేకపోతే కథువా, ఉన్నావ్ లాంటి కేసులు బయటికి వచ్చేవే కావు. మీడియా తెచ్చిన ఒత్తిడి కారణంగానే మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలన్న కొత్త చట్టం వచ్చింది. ఇందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా" అని వెల్లడించారు.