స్కూల్ బస్సును ఢీకొన్న రైలు...13 మంది మృతి

SMTV Desk 2018-04-26 11:24:22   Accident, SCHOOL BUS, Uttarpradesh

లక్నో, ఏప్రిల్ 26 : ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టడంతో 13మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు తునాతునకలైంది. క్రాసింగ్ వద్ద కాపలాదారుడు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 13మంది ప్రాణాలు కోల్పోగా ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రైలు సివాన్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది 10 సంవత్సరాల లోపు చిన్నారులే అని అధికారులు తెలిపారు. ఘటనలో బస్సు డ్రైవర్‌ కూడా చనిపోయాడని పోలీసు అధికారి ఓపీ సింగ్‌ వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.