శ్రీనగర్, ఏప్రిల్ 25: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. ప్రస్తుతం సల్మాన్ ‘రేస్3’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ జమ్ములో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన సీఎంను కలిసి గంటసేపు చర్చించారు. అనంతరం చిత్రీకరణ నిమిత్తం సోనామార్గ్ ప్రాంతానికి చేరుకున్నారు. ‘రేస్ 3’ లోని పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రబృందం విదేశాల్లో తెరకెక్కించాలనుకుంది. ఇందులో సల్మాన్కి జోడీగా జాక్వెలీన్ ఫెర్నాండెజ్, డైసీ షా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డెసౌజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ కృష్ణజింకల కేసులో సల్మాన్కు జోధ్పూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. జోధ్పూర్ సెంట్రల్ జైల్లో రెండు రోజులు గడిపిన సల్మాన్ మూడో రోజు బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశం దాటి వెళ్లకూడదని న్యాయస్థానం ఆదేశించింది.