హైదరాబాద్, ఏప్రిల్ 25 : తెలుగు చిత్రపరిశ్రమలో రోజురోజుకి పరిస్థితులు దిగాజారిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఉదంతం యావత్ దేశ సినీపరిశ్రమలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు తాజాగా మరో నిరసన సెగ టాలీవుడ్ ను తాకనుందని సమాచారం. వేతనాల విషయంలో కొద్ది నెలలుగా లైట్స్మెన్ పోరాటం చేస్తున్నారు. అదనపు షిఫ్టుల్లో పనిచేస్తున్నా జీతాలు- బేటాలూ ఇవ్వడం లేదన్నది వాళ్ల వాదన. కొన్నేళ్లుగా తమ వేతనాలు ఒకేలా ఉన్నాయని, వాటిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల సమ్మె నోటీసు కూడా పంపారు. దాంతో నిర్మాతలు దిగివచ్చారు. త్వరలో 25 శాతం వరకూ వేతనాలు పెంచుతామని మాట ఇచ్చి.. సమ్మె జరక్కుండా ఆపారు. అయితే ఇప్పుడు కేవలం 12 శాతమే పెంచారట. దీనిపై లైట్స్మెన్ మళ్లీ తమ నిరసన వ్యక్తం చేయడం మొదలెట్టారు. మరోసారి సమ్మెకి పిలుపు ఇవ్వడంతో.. ఈరోజు నిర్మాతలమండలితో కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఇరు వర్గాల వారికీ రాజీ కుదర్లేదని తెలుస్తోంది. మరి ఈ సమస్యకు చిత్రపరిశ్రమ తగిన విధంగా స్పందించి పరిష్కార మార్గం చూస్తుందా..? లేదో..? వేచి చూడాలి.