వైజాగ్, ఏప్రిల్ 24: ప్రచండమైన గాలుల కారణంగా భారత తూర్పు తీరంలోని సముద్రంలో భారీ అలలు ఎగసి పడే ప్రమాదముందని సునామీ హెచ్చరికల సంస్థ (ఇన్ కాయిస్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 తేదీల వరకూ సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. భారత తూర్పు తీరంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్బంగా తీర ప్రాంతాల్లోని సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్ కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది. ఇన్కాయిస్ హెచ్చరికలతో విశాఖ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో అనే భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే వాతావరణంలో మార్పులు సంభవించాయి. గాలుల తీవ్రత పెరిగింది. కాసేపటి క్రితం వర్షం కూడా కురిసింది. సముద్ర స్నానాలు నిలిపివేయాలని, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఇన్కాయిస్ సూచించింది. కేరళలో ఇప్పటికే 100 ఇళ్లు నీట మునిగినట్టు సమాచారం.