నోయిడా, ఏప్రిల్ 24: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్, కథువా ఘటనలు మరువక ముందే మరో సాముహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కారులో లిఫ్ట్ ఇస్తామంటూ తన తోటి స్నేహితులే 17 ఏళ్ల బాలికపై దాష్టీకానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు చెందిన 17 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా తన తోటి స్నేహితులు కారులో ఇంటివద్ద దింపుతామని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఆమెకు దూరపు బంధువు, మరొకరు పాఠశాలలో తోటి విద్యార్థి కాగా మరో వ్యక్తి అపరిచితుడు. అయితే, రోజూ మధ్యాహ్నానికే ఇంటికి రావాల్సిన తమ కుమార్తె ఆ రోజు సాయంత్రమైనా రాకపోవడంతో తల్లిద్రండులు ఆందోళనకు గురయ్యారు. అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అర్ధరాత్రి బాలికను గుర్తించారు. పాఠశాల బస్సు తప్పిపోవడంతో తాను ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ముగ్గరు వ్యక్తులు వచ్చి తనను ఇంటి వద్ద దింపుతామని నమ్మించారని, కారులోకి ఎక్కాక వారు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపిందని పోలీసులు చెప్పారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.