ద్వారపూడి, ఏప్రిల్ 24: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయినా రూ. 24వేల కోట్ల రైతు రుణమాఫి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని మంత్రి లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ 68 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు యువకుడిలా పనిచేస్తున్నారని అన్నారు. చాలీ చాలని రూ. 200 పెన్షన్న్లను ఐదు రెట్లు పెంచి రూ. 1000 చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని ఆయన అన్నారు. సీఎం హయాంలో అరకోటి మందికి పెన్షన్లు అందుతున్నాయని, 24 గంటలపాటు కరెంట్ ఇవ్వడం సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పంచాయితీలు అభివృద్ధి చెందలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధిహామీలో భాగంగా రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.