కమ్యూనిస్టులపై బీజేపీ అసత్య ప్రచారం

SMTV Desk 2018-04-24 15:46:20  CPI Rama krishna, counter, BJP Government

హైదరాబాద్, ఏప్రిల్ 24‌: చౌకబారు రాజకీయాలు చేస్తూ, కమ్యూనిస్టులపై బీజేపీ అసత్యప్రచారం చేస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో స్కామ్‌లను కూడా కమ్యూనిస్టులకు అంటగడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తాము యూపీఏ1కు మాత్రమే మద్దతు తెలిపామని, యూపీఏ 2 ప్రభుత్వానికి కాదని గుర్తుచేశారు. యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాలపై బీజేపీతో పాటు తాము కూడా పోరాటం చేశామని చెప్పారు. 2జీ స్పెక్ట్రం కేసులో జైలుకు వెళ్లిన కనిమొళి, రాజా.. మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎక్కడున్నారన్నారు. యూపీఏ హయాంలో జైళ్లలో ఉన్న గాలిజనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తూ తన అనుచరులు 9 మందికి, తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నారని తెలిపారు. అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారని, జైళ్లో ఉండాల్సిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.