న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 ; బిహార్, యూపీ, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంత్ మాట్లాడుతూ.."బిహార్, యూపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు భారత ఆర్థికాభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. ముఖ్యంగా సామాజిక సూచీలో ఆయా రాష్ట్రాల పరిస్థితి మరీ దిగజారిపోయింది. విద్యా-ఆరోగ్య వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నాయి. మానవాభివృద్ధి సూచీ(హెచ్డీఐ)లో మొత్తం 188 దేశాలకు గానూ భారత్ 131వ స్థానంలో ఉంది. అయితే దక్షిణ భారతంలో, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది. హెచ్డీఐలో భారత్ స్థితి మెరుగుపడితేనే.. సామాజిక సూచీ విషయంలో మేం ఏమైనా చేయగలుగుతాం. అప్పటిదాకా పరిస్థితి ఇలానే ఉంటుంది " అని కాంత్ వ్యాఖ్యానించారు.