చెన్నై, ఏప్రిల్ 24 : భారత తూర్పు తీరంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్బంగా తీర ప్రాంతాల్లోని భారీ అలలు ఎగిసిపడే ప్రమాదముందని సునామీ హెచ్చరికల సంస్థ (ఇన్ కాయిస్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 తేదీల వరకూ సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం అండమాన్ వైపు నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని ఇన్కాయిస్ వెల్లడించింది. అలల దాదాపుగా 3-4 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని స్పష్టం చేసింది. ఇవి తీరానికి చేరుకునే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలిపింది. సముద్ర తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ రెండు రోజుల పాటు సముద్ర స్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని తీరప్రాంత జిల్లాల యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు ఇన్ కాయిస్ ఇచ్చింది. అదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది.