న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : మేఘాలయలో భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. అరుణాచల్ప్రదేశ్లో ఈ చట్టాన్ని పాక్షికంగా తొలగించింది. భద్రతా దళాలు ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేసేందుకు అధికారం కల్పిస్తున్న ఏఎఫ్ఎస్పీఏను మార్చి 31 నుంచి మేఘాలయలోని అన్ని ప్రాంతాల్లో ఎత్తివేశారు. భద్రత పరంగా మేఘాలయలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని, అందుకే ఈ చట్టాన్ని తొలగించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు విదేశీయులపై ఉన్న నిబంధనలను కేంద్రం తోలిగించింది. ప్రత్యేక అనుమతి ఏదీ అవసరం లేకుండానే పర్యటించవచ్చని స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ వంటి పలు దేశాల పర్యాటకులకు మాత్రం ఇది వర్తించదని కేంద్రం చెప్పింది.