హైదరాబాద్, ఏప్రిల్ 23 : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో శిఖర్ ధావన్, భువనేశ్వర్ అంటే ఇష్టమని ప్రపంచ నంబర్వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ అంటున్నాడు. ప్రతి భారతీయుడి డీఎన్ఏలో క్రికెట్ ఉంటుందని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. తాజాగా అతను మాట్లాడుతూ.. "చిన్నప్పుడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాను. ఇప్పుడు అకాడమీలో విరామ సమయంలో క్రికెట్ ఆడుతుంటాము. ప్రతి భారతీయుడి డీఎన్ఏలో క్రికెట్ ఉంటుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నాకు శిఖర్ ధావన్, భువనేశ్వర్ అంటే నాకు ఇష్టం. వీరిద్దరే మన జట్టులో కీలకమైన ఆటగాళ్లు" అని శ్రీకాంత్ అన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టాలీవుడ్ తారలతో పాటు క్రీడాకారులు మద్దతు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు ఆ జట్టు నిర్వాహకులు ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.