కేప్టౌన్, ఏప్రిల్ 23 : ప్రీమియర్ సాకర్ లీగ్(పీఎస్ఎల్) సెమీఫైనల్ మ్యాచ్లో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. తమ అభిమాన జట్టు ఓటమి తట్టుకోలేక మైదానంలోకి వచ్చి నానా రచ్చ చేశారు. ఈ ఘటన దక్షిణాఫ్రికా లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఫుల్ వైరల్ గా మారింది. జొహన్నస్బర్గ్కు చెందిన కైజర్ ఛీఫ్స్ జట్టు.. నెడ్ బ్యాంక్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో 2-0 తేడాతో ఫ్రీ స్టేట్ స్టార్స్ జట్టుపై ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే తమ అభిమాన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు ఆగ్రహావేశాలతో స్టేడియంలోకి చొచ్చుకువచ్చి గ్రౌండ్ను ధ్వంసం చేశారు. అనంతరం గ్రౌండ్లోకి వచ్చి సెక్యురిటీ గార్డులపై దాడికి దిగారు. ఈ ఊహించని షాక్కు గురైన ఇరుజట్లకు చెందిన క్రీడాకారులు ఒక్కసారిగా గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఆందోళనకారులు బారీకేడ్లను కిందపడేసి, కుర్చీలు విసిరేసి, కెమెరాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. మైదానంలో చోటు చేసుకున్న పరిణామాలపై పీఎస్ఎల్ ఓ ప్రకటనను విడుదల చేసింది. మోసెస్ మబిదా స్టేడియంలో మ్యాచ్ అనంతరం జరిగిన అల్లర్ల సంఘటనను పీఎస్ఎల్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.