బెంగుళూరు, ఏప్రిల్ 23 : కర్ణాటక రాష్ట్రంలో వచ్చే నెల 12న జరిగే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) లు రేస్ లో ఉన్నాయి. అయితే వీరిలో గెలుపెవరిది..? ఇప్పుడు ఈ ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆ మూడు పార్టీల మధ్య పోటీ ప్రధానంగా ఉన్నప్పటికీ ఎన్నికల తేదీ దగ్గరకొస్తున్నకొద్దీ రోజుకో రకంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఇప్పుడుకాంగ్రెస్ విజయావకాశాలను చిన్న పార్టీలు చిత్తు చేస్తాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. 2013 ఎన్నికల్లో బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని కర్ణాటక జనతా పక్ష, బి.రాములు ఆధ్వర్యంలోని బీఎస్ఆర్ కాంగ్రెస్ సహా చిన్నా చితక పార్టీలు ఏకంగా 15శాతం ఓట్లను సాధించి బీజేపీకి అధికారం రాకుండా అడ్డుకోవడంతో.. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు లేకపోయినప్పటికీ, మిగిలిన పార్టీలు ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తోంది. వాటిలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సోషల్ డెమొక్రటికి పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ (ఎఐఎంఎంపీ), పార్టీ కాంగ్రెస్ కు ఇబ్బంది పెడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.