హైదరాబాద్, ఏప్రిల్ 23 : కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని డీఏఈ కాలనీ ప్రాంతంలో నలుగురు యువతులు అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మరణానికి కారుకులయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పిఫుట్పాత్పై పడుకున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్ పాత్పై నిద్రిస్తున్న అశోక్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తి మృతిచెందగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఏఎస్ రావు నగర్ నుంచి తార్నాక వైపుకు స్కోడా కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినిలు పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఈశాన్యరెడ్డి అనే విద్యార్థిని కారు నడుపుతున్నట్లు సమాచారం. విద్యార్థినులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.